TODAY EDUCATION/TEACHERS TOP NEWS 03/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయో పరిమితి పెంపు వెసులు బాటును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 సెప్టెంబర్ 27న జారీ చేసిన జీవో 105 ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది. 2023 సెప్టెంబర్ వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీపీఎస్సీ సహా మిగతా ప్రభుత్వ నియామక సంస్థలు ఈ అంశాన్ని నోటిఫై చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ -1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూ లు నిర్వహించాలని సర్కారు. నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

దసరా సెలవుల్లో క్లాసులు నడిపితే కఠిన చర్యలు: ఇంటర్ బోర్డ్ హెచ్చరిక

ప్రయివేట్, అన్ ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీ లు దసరా సెలవుల్లో విద్యార్ధులకు ఎటువంటి క్లాసులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు హెచ్చరించింది. ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు ప్రిన్సిపాల్స్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈమేరకు ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈమేరకు ప్రాంతీయ పర్యవేక్షక అధికారులు కాలేజీలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈనెల రెండో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

8న పీఈటీల సంఘ సమావేశం

ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఏపీఎస్ఏపీఈఏ) సంఘ సమావేశాన్ని ఈ నెల 8వ తేదీన మంగళగిరిలోని అరవింద పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.పి. రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని వ్యామాయ ఉపాధ్యాయులను సంఘటితం చేసి వారి సమస్య లను పరిష్కరించేందుకు ఉన్నత విలువలతో కూడిన నాయకత్వానికి ఈ సమావేశంలో శ్రీకారం చుడతామన్నారు.

ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పెంపు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువును ఈనెల 15వ తేదీ వరకు పెం చినట్లు యూనివర్సిటీ స్టడీ సెంటర్ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం. అజంతకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులయిన వారు, పీజీలో ప్రవేశాలకు మూడేళ్ల డిగ్రీ పూర్తిచే సిన వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరింత సమాచారం కోసం 0866-2434868లో సంప్ర దించాల్సిందిగా ఆయన కోరారు.

మండలిని రద్దుచేస్తామంటూ బెదిరించారు: ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం

పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన యూటీ ఎఫ్

బిల్లులు ఆమోదం పొందకుండా చేసినందుకు, తమను బెదిరించడానికి పాలకులు మండలిని రద్దుచేస్తామని చెప్పారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. అలా చేసినా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని పేర్కొన్నారు. వచ్చేఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతిస్తున్న పీడీఎఫ్ అభ్య ర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సామాజిక ఉద్య మాల్లో ఉంటూ, మచ్చలేని వారిని అభ్యర్థులుగా ప్రకటించామన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు కాపాడా లన్నా, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నా.. పీడీఎఫ్ ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ షేక్ సాల్జీ మాట్లాడుతూ సీపీఎస్ రద్దుచేసి, ఓపీఎస్ చేయాలా? లేకపోతే జీపీఎస్ ను అంగీకరించాలా? అనేదానిపై త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే ఎన్నికలను రెఫరెండంగా భావించాలని కోరారు.

 ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థిగా పి. బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎం. వెంకటేశ్వర రెడ్డి, ఉమ్మడి కడప, కర్నూలు అనంతపురం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థిగా కత్తి నర్సింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల నాగరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. రమాప్రభకు యూటీ ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ తెలిపారు.

మధ్యాహ్న భోజనం తయారీకిచ్చే మొత్తం పెంపు…రెండేళ్ల తర్వాత 9.60 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం!

దేశవ్యాప్తంగా విద్యార్థులకు ‘మధ్యాహ్న భోజనం’ తయారీలో వంట ఏజెన్సీలకు అందజేసే మొత్తం పెరగనుంది. కొన్నేళ్లుగా ఏటా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వంతున పెంచు తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆ మాటెత్త లేదు. మరోవంక.. ధరల మంట నేపథ్యంలో వివిధ తరగతుల విద్యార్థులకు భోజనం తయారీకి ప్రభు త్వాలు చెల్లించే ధరను పెంచాలని వంట ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నిపు ణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ కొద్ది నెలల క్రితం నివేదికను సమర్పించింది. ఎన్ఐఎన్ మాత్రం 1-5 తరగతుల విద్యార్థులకు రూ.10లు, ఇతరులకు రూ.12లకు పెంచాలని సిఫారసు చేసినట్లు సమా చారం. మొత్తానికి 20 శాతం వరకు పెంచవచ్చని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు చెల్లిస్తున్న ధరలపై 9.6 శాతం పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మొత్తంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా భరిస్తాయి.

అక్షరాభ్యాసం చేసిన 3వేల మంది చిన్నారులు

 విజయనగరం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతీ ఆలయం ఆదివారం కిక్కిరిసింది. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు చేయించేందుకు దాదాపు 3,000 మంది చిన్నారులతో కలిసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తర లివచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు చేరుకుని సరస్వతీదేవి, మహాలక్ష్మి, భువనేశ్వరీదేవిని దర్శిం చుకున్నారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం తాతాచార్యులు, బృందావనం రామ్ గోపాలా చార్యులు ఆధ్వర్యంలో తులాభార సేవ జరిగింది. భక్తులకు ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనాలు అందించినట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెరుకూరి శ్రీధర్, జి. శ్రీనివాసరావు తెలిపారు.

కొత్త పీఆర్సీ జీతాల్లోభత్యాలకు కత్తెర

ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగుల ఖాతాల్లో నేడో, రేపో వేతన సవరణ (పీఆర్సీ) తో కూడిన కొత్త జీతాలు జమవుతాయి. ఉద్యోగులంతా తమ జీతాలు ఎంత పెరిగాయో నని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త జీతాల్లో భత్యాలను జత చేయకుండా నిలిపేశారు. దీంతో ఓవరైమ్ (ఓటీ)తోపాటు, వివిధ భత్యాల రూపంలో ఉద్యోగులకు దక్కాల్సిన సొమ్ము ఈ నెల జీతాలతో కలిపి రాదని తెలిసింది. మూలవేతనాన్ని చివరి నిమిషంలో ఖరారు. చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీలో 51,488 మంది ఉద్యో గులుండగా.. వీరందరికీ జూన్ నుంచి కొత్త పీఆర్సీ అమలవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే పలు కారణాలతో జూన్, జులై, ఆగస్టు జీతాల్లో పీఆర్సీ అమలు చేయలేదు. పదోన్నతులు పొందిన 2,096 మంది మినహా మిగిలిన వారికి.. అక్టోబరులో వచ్చే జీతంలో కొత్త పీఆర్సీ అమలు చేశారు. ఇందులో మూలవేతనం, డీఏ, హెచ్ఎస్ఏ, సీసీఏ తదితరాలే చూపారు. 45 వేల మందికి పైగా ఉద్యోగు లకు లభించే ఓటీ, డే ఔట్, నైట్ ఔట్, నైట్ షిఫ్ట్ భత్యాలు కలపలేదు. దీంతో ఉద్యోగులకు రూ.5-10 వేలు తగ్గనుంది.

మూల వేతనం ఖరారులో జాప్యం

ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం మూలవేతనం ఎంతనేది. ఖజానా శాఖ ఖరారుచేసి గత నెల చివర్లో ప్రకటించింది. దీంతో మూల వేతనం ఆధారంగా లెక్కించాల్సిన ఓటీ వివరాలను ఆర్టీసీ అధికారులు ఇవ్వలేకపోయారు. దీనివల్ల ఓటీ, ఇతర భత్యాలను కలపలేదని చెబు తున్నారు. ఈ భత్యాలన్నింటినీ వచ్చే నెల ఇచ్చే జీతంలో కలిపి ఇస్తా మని అంటున్నారు. ఆర్టీసీలో 45 వేల మందికి రావాల్సిన భత్యాలన్నీ కలిపి రూ.4 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.

• కొత్త జీతాల పే స్లిప్స్ బయటకు వచ్చాయి. వాటిని గత నెల జీతా
లతో పోలిస్తే.. ఎక్కువ మందికి పీఆర్సీ వల్ల పెద్దగా జీతం పెరగలే
దని, డీఏ పెంపుతోనే జీతాలు పెరిగాయని చెబుతున్నారు. డీఏ 11.6శాతం నుంచి 20.02 శాతానికి పెంచారు. దీనివల్ల జీతాల్లో పెరుగుదలకనిపిస్తోందని ఉద్యోగులు అంటున్నారు.

బడికి బై..బై

ఏలూరు జిల్లాలో 6,704  మంది డ్రాపవుట్లు

వెతికి బడికి పంపే పనిలో సచివాలయ సిబ్బంది, సీఆర్పీలు

బడుల విలీనమే కారణమా ?

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిమానేసిన (డ్రాపవుట్‌ చిల్డ్రన్‌) బాల బాలికలు 11,483 మందిగా అధికారికంగానే వెల్లడైంది. ఒక్క సారిగా ఇంతపెద్దసంఖ్యలో విద్యార్థులు స్కూలు తెరిచిన రెండునెలల్లోనే బడికి దూరం కావడానికి కారణాలపై పలురకాల విశ్లేషణలు, అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది నూతన విద్యావిధానంలో భాగంగా జరిగిన పాఠశాలల విలీనం ఓ ప్రధానకారణం కావచ్చునన్నదే హైలైట్‌గా నిలుస్తోంది. స్థానికంగా వున్న ఊరిబడిని దూరంగా వున్న మరో పాఠశాల లోకి ప్రాథమిక తరగతులను విలీనం చేయడంతో మధ్యలోనే బడిమానేసిన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమని చెబుతున్నారు. అయితే విద్యాశాఖ వాదనమాత్రం మరోలా ఉంది. విద్యార్థులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, కుటుంబ పరిస్థితులు, ఇతర పాఠశాలల్లో చేరినా వారిని డ్రాపవుట్లుగా చూపించడం, అనారోగ్య పరిస్థితులు, వైకల్యం తదితర కారణాలను అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని డ్రాపవుట్‌ విద్యార్థులందరినీ వెతికిపట్టుకుని, వారి తల్లితండ్రులకు నచ్చజెప్పడం ద్వారా సంబంధిత పిల్లలందరినీ మళ్లీ బడికి రప్పించే కార్యాచరణ ప్రారంభించారు. ఇంతవరకు గుర్తించిన డ్రాపవుట్లను సమీప ప్రభుత్వ బడుల్లో చేర్చినట్టు చెబుతున్నప్పటికీ, దసరా సెలవుల అనంతరం బడులు తెరిచినప్పుడు వీరిలో ఎంతమంది మళ్లీ తరగతులకు రెగ్యులర్‌గా వస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

ఉమ్మడి డ్రాపవుట్లు ఇలా

ఏలూరు జిల్లాలో 6,704 మంది డ్రాపవుట్లలో బాలురు 3,822 మంది, బాలికలు 2,882 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 4,779 మంది డ్రాపవుట్లలో బాలురు 2,779 మంది, బాలికలు 2 వేల మంది ఉన్నట్టు అధికారికంగా ధ్రువీకరించారు. డ్రాపవుట్లకు కారణాలపై సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఎక్కడా పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల విలీన అంశాన్ని లేవనెత్తకుండా, ఇతర అంశాలను కారణాలుగా చూపేందుకు ప్రాధాన్యత నిచ్చారు. కొందరు విద్యార్థులు చనిపోయారని, మరికొందరు ఇతర ప్రాంతాలకు,  వలస వెళ్లి పోయారని విశ్లేషించారు. మొత్తంమీద 9 రకాల కారణాలను డ్రాపవుట్లకు ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు టీసీలు తీసుకోకుండానే ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోయిన సందర్భాల్లో వారంతా డ్రాపవుట్ల జాబితాలో చేరిపోయారని చెబుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వ పరంగా యూడైస్‌ కోడ్‌ ఉండకపోవడం కూడా ఓ కారణమంటు న్నారు. కిడ్నీ, గుండెజబ్బులు, అనారోగ్యం, సీడబ్ల్యుఎస్‌ఎన్‌ (వైకల్యం) కారణంగా బడిమానేసినవారి సంఖ్యకూడా దీనికి జత కావడం వల్ల ఎక్కువగా కనబడుతున్నారని అధికార వర్గాల విశ్లేషణగా ఉంది. ముఖ్యంగా 5,7,8 తరగతుల్లోనే డ్రాపవుట్ల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు.

ఫాలో అప్‌ ఉంటేనే సత్ఫలితాలు

గుర్తించిన డ్రాపవుట్‌ విద్యార్థులందరినీ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ చేర్చేందుకు ప్రస్తుతం కార్యాచరణ ప్రారంభిం చారు. ఆ మేరకు కొందరిని సచివాల యాల్లో విధులు నిర్వర్తించే ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వలంటీర్లు, సమగ్రశిక్ష సీఆర్పీలు, ఎంఈవోలు తిరిగి బడుల్లో చేర్పించే కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతున్నాయి. సెలవుల అనంతరం ఆయా బడుల్లో చేర్చిన డ్రాపవుట్‌ విద్యా ర్థుల్లో ఎంతమంది రెగ్యులర్‌గా తరగతులకు వెళుతున్నారో మానటరింగ్‌ చేయడంపైనే ఫలతాలు ఆదారపడి ఉంటాయని చెప్పవచ్చు. గుర్తించిన విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు, అమ్మఒడిని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని సమగ్రశిక్ష జిల్లా అధికారులు వివరించారు.

సీబీఎస్‌ఈపై..సందేహాలు

కమిటీ అనుమతిపై అనుమానాలు

జిల్లాలో 14 పాఠశాలల కోసం ప్రతిపాదనలు

సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం సౌకర్యాలు అంతంతే

త్వరలో పరిశీలనకు రానున్న సీబీఎస్‌ఈ కమిటీ సభ్యులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ మార్పు జరిగేనా?

 పేదలు కూడా సీబీఎస్‌ఈలో బడుల్లో చదువుకోవాలి. ఆ విధంగా చేస్తాం.. వచ్చే విద్యా సంవత్సరంలోనే సీబీఎస్‌ఈ పాఠశాలలు అందుబాటులోకి తెస్తాం.. అని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో 14 పాఠశాలలను ఎంపిక చేసి సీబీఎస్‌ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఆయా పాఠశాలల్లో ఉన్న పరిస్థితులు, వసతులను బట్టి చూస్తే సీబీఎస్‌ఈ కమిటీ అనుమతి ఇస్తుందో, లేదోనన్న సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఇందుకు మూల కారణం సీబీఎస్‌ఈ నియమ, నిబంధనలు పకడ్బందీగా ఉంటాయి. విశాలమైన తరగతి గదులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ప్లేగ్రౌండ్‌, ల్యాబ్‌లు వంటి అనేక సదుపాయాలు కలిగివుండాలి. అప్పుడే సీబీఎస్‌ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే ఆమోదం తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 14 జడ్పీ పాఠశాలల్లో ఎన్నింటికి అనుమతులు వస్తాయోనన్న సందేహాలు కలుగుతోన్నాయి.  జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న జిల్లాపరిషత్‌ హైస్కూళ్లలో వందల మంది విద్యార్థులు చదువులు సాగిస్తోన్నారు. వీరంతా తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలను సీబీఎస్‌ఈలోకి మార్చేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాలో 14 స్కూళ్లని రాబోయే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రతిపాదించింది. అయితే సీబీఎస్‌ఈ పాఠశాలలుగా గుర్తింపునకు కమిటీ నియమ, నిబంధనలు పకడ్బందీగా ఉంటాయి. ఆయా నియమ నిబంధనలు అన్నీ సక్రమంగా ఉంటేనే సీబీఎస్‌ఈ పాఠశాలలుగా గుర్తింపు ఇస్తోంది. లేదంటే లేదు. గుంటూరు నగరంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యంలో కొనసాగుతోన్న సీబీఎస్‌ఈ స్కూళ్లని చేతివేళ్లతో లెక్కించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నల్లపాడులో కేంద్రీయ విద్యాలయం ఉన్నది. అలానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో భారతీయ విద్యాభవన్‌ ఉన్నది. మిగతావి మిషనరీస్‌, ప్రైవేటు విద్యా సంస్థలే. వాటిల్లో అకడమిక్‌ కరిక్యులమ్‌ వేరుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో  జిల్లాలోని ఏకంగా 14 జడ్పీ పాఠశాలలను సీబీఎస్‌ఈగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ఆయా పాఠశాలల్లో సరైన వసతులు లేవు. భవనాలు సక్రమంగా ఉంటే సరైన సౌకర్యాలు ఉండవు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విశాలమైన ప్రాంగణం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఉపాధ్యాయులు లేరు. ఇక ల్యాబ్‌లు అయితే మచ్చుకు కూడా కానరావు. మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేక పోవడంతో అవి అధ్వానంగా ఉంటాయి. ఇక గదులు ఉన్నా అవి ఇరుకుఇరుకుగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ కమిటీ పరిశీలనలో వీటిని పరిగణనలోకి తీసుకుంటే అనుమతిపై కష్టమేనని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం జడ్పీ హైస్కూళ్లలో తరగతులు బోదిస్తోన్న వారికి సీబీఎస్‌ఈ సిలబస్‌ గురించి అంతగా అవగాహన లేదు. జడ్పీ హైస్కూళ్లలో నాడు – నేడు కింద అంతంత మాత్రంగానే పనులు జరుగుతోన్నాయి. వాటిల్లో చాలావరకు మరమ్మతులే ఉంటోన్నాయి. అరకొరగా అదనపు తరగతి గదులు, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లకు నిధులు వెచ్చిస్తోన్నారు. బెంచీలు, బ్లాక్‌బోర్డులు వంటివి మాత్రమే ఏర్పాటు చేస్తోన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కారణంగా పాఠశాలల్లో క్రీడా మైదానాల వైశాల్యం తగ్గిపోతోన్నది. ల్యాబ్‌లు భూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. ఆయా సౌకర్యాల గురించి పట్టించుకోకుండా పొన్నూరులోని నిడుబ్రోలు, వేజండ్ల, వెనిగండ్ల, మంగళగిరిలో రేవేంద్రపాడు, నిడమర్రు అండ్‌ చినకాకాని, పెనుమాక స్కూళ్లని సీబీఎస్‌ఈ మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అలానే ప్రత్తిపాడు పరిధిలో జొన్నలగడ్డ, ప్రత్తిపాడు, తుళ్లూరు మండలంలో తుళ్లూరు, మేడికొండూరు మండలంలో సిరిపురం, తాడికొండలో రావెల, తెనాలిలో సంగంజాగర్లమూడి జడ్పీ హైస్కూళ్లని ప్రతిపాదించింది. అయితే వీటిల్లో ఎక్కువ స్కూళ్లలో సీబీఎస్‌ఈ నిబంధనలకు సరితూగేవి లేవన్నది ఉపాధ్యాయవర్గాల అభిప్రాయం. కాగా త్వరలో సీబీఎస్‌ఈ బృందం జిల్లాకు వచ్చి ఆయా స్కూళ్లని పరిశీలించనున్నది. ఆ తర్వాతే వాటి భవితవ్యం తేలుతుంది. జిల్లాలో ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య చాలా పరిమితంగా ఉన్నది.

దసరాకు పస్తులే!…ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందని జీతాలు

  •  ఎదురుచూస్తున్న టీచర్లు, పీటీడీ ఉద్యోగులు
  •  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదీ అదే పరిస్థితి

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతినెలా జీతాల బట్వాడాలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈనెల ఒకటో తేదీన టీచర్లతో పాటు ప్రజా రవాణా ఉద్యోగులు, కార్మికులకు జీతాలు జమకాలేదు. దసరా పండగ నేపథ్యంలో కచ్చితంగా జీతాలు తమ ఖాతాల్లో జమవుతాయని భావించిన వీరంతా పండగ పూటా పస్తులుండాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో 12 వేలమంది ఉపాధ్యాయులు, 5,500 మంది ప్రజారవాణా ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇతర శాఖలు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మరో 20 వేల మంది వరకు ఉంటారు. వీరిలో టీచర్లు, పీటీడీ ఉద్యోగులు, కార్మికులతోపాటు మరికొన్ని శాఖల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఈనెల ఒకటో తేదీన జీతాలు అందలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు రాకపోవడం షరామామూలు వ్యవహారంగా మారిపోయినప్పటికీ, కనీసం దసరా సందర్భంలో కచ్చితంగా జమవుతాయని భావించినా వీరికి నిరాశ ఎదురయింది. ఈ నెల రెండోతేదీ ఆదివారం, సోమవారం దుర్గాష్టమి సెలవులు. మంగళవారం జీతాలు వేస్తే సరి… లేకపోతే ఐదోతేదీ విజయదశమి సెలవు. ఈ నేపథ్యంలో పండగ తరువాతే జీతాలు అందే అవకాశముందని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండగ ఖర్చులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ కంపెనీలకు ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్ర అవరోధం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత తేదీలోగా ఈఎంఐ చెల్లించకపోతే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.

మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

జీతాల బట్వాడాలో ప్రతినెలా జాప్యం నెలకొంటుండడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతిరోజూ కచ్చితమైన సమయానికి పాఠశాలకు వెళ్లాలని, తమ సొంత ఫోన్లలోనే ఫేషియల్‌ యాప్‌ ద్వారా హాజరు వేయాలని షరతులు విధించిన ప్రభుత్వం, ఒకటో తేదీనే జీతాలు ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి.

పదోన్నతి సరే…విధులెక్కడ? బడుల్లో ఖాళీలు చూపకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన

 పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల పదోన్నతుల కల్పనకు ఇటీవల రెండు రోజుల పాటు గుంటూరు పరీక్షా భవన్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. దీనికి ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా అర్హులైన ఉపాధ్యాయులు వచ్చారు. అయితే వారి నుంచి ధ్రువపత్రాల పరిశీలన అయితే జరిగింది కానీ వారికి పదోన్నతులు ఎక్కడ ఇచ్చేది? ఆ స్కూళ్ల వివరాలేమిటన్నది ఇప్పటి వరకు విద్యాశాఖ వెల్లడించలేదు. అసలు పదోన్నతుల ఖాళీల వివరాలను చెప్పకుండా పదోన్నతులిస్తామని చెప్పడం ఏంటని సంఘాల నాయకులు, అర్హులైన ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ విషయమై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ఇంతకు ముందే ఒకసారి పదోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ప్రస్తుతం మళ్లీ ధ్రువపత్రాలు పరిశీలించి వాటిని రికార్డుల్లో నమోదు చేయకుండా ఉండటాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ధ్రువపత్రాలు ఇలా ఎన్నిసార్లు పరిశీలన చేస్తారు? ఎందుకు చేస్తున్నారో కనీసం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండా ఈ ప్రక్రియ నిర్వహించటం ఏమిటని సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై రుసరుసలాడుతున్నారు. దీనిపై డీఈవోలు సైతం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో కొందరు డీఈవోలు ఈ ప్రక్రియ నిర్వహణకు రాతపూర్వక ఉత్తర్వులు లేకపోతే కోర్టుకెళ్లే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఇప్పటి వరకు ఉన్నత స్థాయి నుంచి ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు వెలువడలేదని కింది స్థాయి యంత్రాంగం పేర్కొంది.

కోర్టుకు వెళ్లిన హెచ్‌ఎంలు

ఇప్పటికే ఎంఈవో-2 పోస్టులకు సరైన విధి విధానాలు ప్రకటించకుండా ఈ పోస్టులోకి రావాలనుకునే హెచ్‌ఎంల నుంచి ఆసక్తి కోరటాన్ని సవాల్‌ చేస్తూ కొందరు ప్రధానోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ ఈ నెలలోనే ఉంది. ఒకవైపు ఈ ఉదంతం కళ్లముందే ఉన్నా ఇటీవల జిల్లాలో సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులను పిలిచి వారి ధ్రువపత్రాలు పరిశీలించారు. ఇది అన్ని జిల్లాల్లో చేపట్టారు. అందులో భాగంగా గుంటూరులో నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. అయితే అసలు పదోన్నతులకు ఎంతమంది అర్హులు, వారికి ఖాళీలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ వివరాలను పారదర్శకంగా నోటీసు బోర్డులో పెట్టకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల జరిగిన ధ్రువపత్రాల పరిశీలనకు ఒక హెచ్‌ఎం పోస్టుకు 1:2 చొప్పున 80 మందిని పిలిచి ధ్రువపత్రాలు పరిశీలించారు. అదేవిధంగా వివిధ సబ్జెక్టులకు 400 మంది ఉపాధ్యాయుల ధ్రుపపత్రాలు పరిశీలించి వారిని స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి హెచ్‌ఎం తత్సమాన పోస్టులో నియామకానికి పిలిచి వారి ధ్రువపత్రాలను పరిశీలించారు.

ఇలాగైతే ఖాళీలు పేరుకుపోతాయి

నిబంధనల ప్రకారం పదోన్నతి ఇచ్చేటప్పుడు ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. అందులో ఖాళీలకు ఐచ్ఛికాలు ఇచ్చుకోమని, వెంటనే వాటి భర్తీకి చర్యలు తీసుకుంటారు. సహజంగా పదోన్నతులకు అనుసరించే విధానమిది. కానీ ఇప్పుడు మాత్రం ‘పదోన్నతులిస్తాం. అందుకు మీకు అంగీకారమేనా? ఆ తర్వాతే పోస్టులకు ఐచ్ఛికాలు కోరతామని’ చెప్పటాన్ని మెజార్టీ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది పదోన్నతులకు ముందుకురారని అంటున్నారు. బహిరంగంగా ఖాళీలు ప్రకటిస్తే అందులో ఆసక్తి ఉన్న పాఠశాలను ఎంపిక చేసుకుని వెళ్తారు. తద్వారా ఖాళీలు భర్తీ అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరులో 38 హెచ్‌ఎం ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే 80 మందిని పిలిచారు. ఖాళీలు చూపకుండా పదోన్నతులు ఎలా కల్పిస్తారు? అసలు ఈ గందరగోళం ఏమిటి? వెంటనే ప్రభుత్వం పదోన్నతుల కల్పనకు జీవో జారీ చేసి పారదర్శకంగా చేపట్టాలని యూటీఎఫ్‌ నేత కళాధర్‌ డిమాండ్‌ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి ప్రక్రియ సరికాదని, వెంటనే ప్రభుత్వం లోపాలను సరిదిద్దుకుని పారదర్శకంగా వ్యవహరించాలని ఏపీటీఎఫ్‌ నేత బసవలింగారావు విమర్శించారు.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!